ప్రైవేటు దిశగా విశాఖ ఉక్కుఅడుగులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఈవోఐ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌) బిడ్జింగ్‌ గడువు ముగిసింది. గత నెల 27న విడుదలైన ఈవోఐ ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం వరకు ఆసక్తిగల కంపెనీలు బిడ్లు దాఖలు చేయవచ్చని ఆహ్వానించారు. 22 కంపెనీలు బిడ్‌లు దాఖలు చేసినట్టు సమాచారం. కాగా బిడ్‌ దాఖలుకు తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఈవోఐ గడువు పెంచినా ఈవోఐ బిడ్జింగ్‌ కి స్పందన కనిపించలేదు.

ఈవోఐ ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌) బిడ్లలో ప్రభుత్వాలు నేరుగా పాల్గొనేందుకు వీల్లేకపోవడంతో కంపెనీలు మాత్రమే పాల్గొనాలి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ సర్కారుకు సింహభాగం వాటా ఉన్న సింగరేణి సంస్థను రంగంలోకి దించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారంటూ భారీ ప్రచారం జరిగింది. కానీ అవన్నీ ఉత్తదేనని తేలిపోయింది. సింగరేణి బిడ్‌ వేయక పోవడంపై కారణాలు చెప్పాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయి.

వాస్తవానికి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రలు ఫలించే పరిస్థితి కనిపిస్తోంది. ‘విశాఖ ఉక్కు’ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడింది. ముడి పదార్థాల కొనుగోలుకు అవసరమైన నిధులు, కంపెనీ నిర్వహణకు అవసరమయ్యే మూలధనం(వర్కింగ్‌ క్యాపిటల్‌) కోసం నానా తిప్పలు పడుతోంది. ఉక్కు ఉత్పత్తిలో ఉన్న ఏదైనా కంపెనీ ఈ నిధులు సమకూరిస్తే.. అందుకు బదులుగా ఉక్కు సరఫరా చేస్తామని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌, విశాఖ ఉక్కు) ప్రకటించింది. ఇందుకు కంపెనీలు ఈ నెల 15వ తేదీలోగా ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ)లు సమర్పించాలని కోరిన విషయం తెలిసిందే.

ఆర్థికంగా కుంగదీసి..

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ దాదాపుగా దివాలాకు దగ్గర్లో ఉందని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రకటించింది. ఇప్పుడు ‘నిధులకు స్టీల్‌’ ప్రతిపాదనకు ఎవరూ ముందుకు రాకపోతే దివాలకు మరింత దగ్గరైనట్టేనని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ఆర్థికంగా కుంగదీసి ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదంతో సాధించుకున్న వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ భవిష్యత్తు ప్రమాదంలో పడింది.

22 వేల కోట్ల అప్పులు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నెత్తిన ప్రస్తుతం రూ.22,000 కోట్ల వరకు అప్పులున్నాయి. వాటికి ఏటా రూ.2,200 కోట్ల వరకు అసలు, వడ్డీలు చెల్లిస్తోంది. ఇది చాలదన్నట్టు పేరుకుపోతున్న వేల కోట్ల నష్టాలు కంపెనీని ఆర్థికంగా మరింత కుంగదీస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు మరో ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్‌(స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా)లో విలీనం చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. కేంద్ర ప్రభుత్వం అందుకు ససేమిరా అనడంతో ప్లాంట్‌ భవిష్యత్తే ప్రమాదంలో పడింది.

ప్రైవేటు దిశగా విశాఖ ఉక్కు

రేషనలైజేషన్‌ పేరుతో విశాఖ ఉక్కులో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్ణయాలను అమలు చేస్తోంది. ప్రైవేటీకరణను అటు కార్మిక సంఘాలు, ఇటు రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పరోక్ష పద్ధతులను ఎంచుకుంది. నోటితో చెప్పకుండా అన్యాపదేశ ఆదేశాలతో ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తిగా నిలిపివేసింది. తద్వారా ప్రైవేటీకరణకు మార్గాన్ని సుగమం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. స్టీల్‌ ప్లాంట్‌లో ఏటా 200 నుంచి 300 మంది ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ లను రిక్రూట్‌ చేయడం ఆనవాయితీ. ఈ ప్రక్రియ ఆగిపోయింది. గత ఏడాది కేవలం ఒక్కరికే విశాఖ ఉక్కులో ఉద్యోగం వచ్చింది. ఇది చాలు ఏ స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నారో అర్థం చేసుకోవడానికి. ఒకవైపు ఏటా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు… మరోవైపు యాజమాన్యం విధానాలు నచ్చక రాజీనామా చేసి వెళ్లిపోతున్న వారితో కర్మాగారం ఖాళీ అవుతోంది. ఈ ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది. అయినా సరే యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. మూడేళ్ల క్రితం విశాఖ ఉక్కులో ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కలిపి 17,000 మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య 14,880కి పడిపోయింది. దాదాపుగా 13 శాతం తగ్గిపోయారు.

 

Leave A Reply

Your email address will not be published.