పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటేనే వ్యాధుల నుండి బయటపడగలం
- ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లిల్లీ మేరి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అసలే వర్షాకాలం వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ. డెంగీ, మెదడువాపు, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణకు దోమతెరలు వాడాల్సి ఉంటుంది. ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటేనే వ్యాధుల నుండి బయటకు పడొచ్చని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లిల్లీ మేరి సూచిస్తున్నారు. క్యూలెక్స్ దోమ వలన మెదడువాపు వ్యాధి వస్తుంది. దోమ కొట్టిన పది రోజుల లోపు లక్షణాలు బయటపడతాయి. ముఖ్యంగా ఒకటి నుంచి 14 ఏళ్ల పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. జ్వరము తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అసాధారణంగా కళ్ళు తిరుగుతాయి. పక్షవాతానికి గురి అయ్యే ప్రమాదం ఉంది. వాంతులు, విరోచనాలు అవుతాయి.
జాగ్రత్తలు ఇలా ..
దోమతెరలు తప్పనిసరిగా వాడాలి. దోమలు ఇళ్లలోకి రాకుండా కిటికీలు, తలుపులు, సన్నటి జాలీలతో బిగించుకోవాలి. జనావాసాల మధ్య పందులు సంచరించకుండా చూసుకోవాలి . మురుగు, ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలి. పిల్లలకు జ్వరం వస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించాలి.
చికెన్ గున్యా లక్షణాలు…
చికెన్ గున్యా జ్వరం పగటిపూట కుట్టే పులిదోమా ద్వారా వస్తుంది. తీవ్రమైన జ్వరము, విపరీతమైన కీళ్ల నొప్పులు ఉంటాయి. ఈ వ్యాధి సోకినప్పుడు భరించలేని ఒళ్ళు, కీళ్ల నొప్పులు, జలుబు ఉంటుంది. వెంటనే అశ్రద్ధ చేయకుండా వైద్యుని సంప్రదించాలి.
మలేరియా లక్షణాలు …
సాయంత్రం పూట జ్వరం రావడం, చలి వణుకు ఉంటుంది. ఈ లక్షణాలను బట్టి చికిత్స చేయించుకోవాలి. రక్త పరీక్ష చేసిన వెంటనే మలేరియా క్రీములు కనబడవు. శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొద్ది రోజులకు మాత్రమే ఇవి రక్త పరీక్షల్లో బయటపడతాయి.
డెంగీ లక్షణాలు …
ఎడిస్ ఈజిప్టు వైరస్ దోమ వల్ల ఒకరి నుంచి మరొకరికి డెంగ్యూ వైరస్ వ్యాప్తి చెందుతుంది. దోమ కుట్టిన తర్వాత ఐదు నుంచి 8 రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఉన్నట్టుండి జ్వరం ఎక్కువగా వస్తుంది. తలనొప్పి అధికమవుతుంది. కంటి కదలికల సమయంలో భరించలేని నొప్పి ఉంటుంది.
బోదకాలు లక్షణాలు…
తరచూ కొద్దిపాటి జ్వరము, ఆయాసం వస్తే బోధకాలు ప్రాథమిక లక్షణాలు. పురుషులలో వరిబీజం ఏర్పడుతుంది. గజ్జల్లో వాపు వస్తుంది. నిర్ధారణకు రాత్రి సమయంలో రక్త నమోనాలు సేకరిస్తారు. బాధితుడు విశ్రాంతి సమయంలో పరాన జీవులు రక్తప్రసరణ వ్యవస్థలో ప్రవేశిస్తాయి. ఐదు నెలల్లో ప్రౌడ జీవులుగా వృద్ది చెందుతాయి. ఇలా శరీరంలో ఆరేళ్లపాటు జీవించే ఈ పరాన్న జీవులు లక్ష సంఖ్యల్లో ఉత్పత్తిఅయ్యి శోషణ వ్యవస్థలోకి చేరుతాయి. దీంతో శరీర అవయవాలు అసాధారణ వాపునకు గురవుతాయి.
దోమతెరలు వినియోగించాలి
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. దోమల నివారణకు కాయిల్స్, లిక్విడ్స్, వ్యాప రేంజర్ల కన్నా దోమతెరలు వినియోగిస్తే ఫలితం ఉంటుంది. ముఖ్యంగా పరిసరాలతో పాటు వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించాలి అని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లిల్లీ మేరి సూచిస్తున్నారు.