బీజేపీ పార్టీని మట్టికరిపిస్తాం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎన్నికల తర్వాత తెలంగాణలో చూద్దామన్నా బీజేపీ ఉండదని.. ఇతర రాష్ట్రాల్లోనూ ఆ పార్టీని మట్టికరిపిస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆ తర్వాత 2024 సాధారణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగానూ బీజేపీని ఓడిస్తామని చెప్పారు. ‘బీజేపీ విద్వేష భావజాలంతో ముందుకెళ్లలేమని ప్రజలు గుర్తించారు. ఆయా రాష్ట్రాల వారు ఇప్పటికే ఆ పార్టీని ఓడించాలని, కాషాయదళ రాజకీయాలను తిప్పికొట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రతిపక్షం ఏకమైంది. మేమంతా కలిసి పనిచేస్తున్నాం. ఓవైపు విద్వేష, విభజనవాద బీజేపీ.. మరోవైపు ఆప్యాయత, ప్రేమపూరిత కాంగ్రెస్. ఇదో భావజాల సమరం’’ అని రాహుల్ అన్నారు. అమెరికా పర్యటనలో ఆయన శనివారం న్యూయార్క్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన డిన్నర్ సమావేశంలో ప్రసంగించారు. సమావేశ సమన్వయ బాధ్యతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పర్యవేక్షించారు. ఈ సమావేశంలో రాహుల్ ప్రసంగిస్తూ.. ‘‘దర్యాప్తు సంస్థలు, అధికారం, మీడియా అండతో కర్ణాటకలో అక్రమ మార్గాల్లో గెలవడానికి ఏం చేయాలో బీజేపీ అన్నీ చేసింది. మా కంటే పదిరెట్లు అధిక ధనం వారి దగ్గరుంది. అయినా వారిని ఓడించగలమని రుజువు చేశాం. ఓడించడం కాదు.. తుడిచిపెట్టేశాం’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. కర్ణాటక తరహాలోనే తెలంగాణతో పాటు త్వరలో ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బీజేపీని తుదముట్టించనున్నట్లు రాహుల్ పేర్కొన్నారు.
ప్రసిద్ధ టైమ్స్ స్వ్కేర్లో జోడో యాత్ర సీన్లు
రాహుల్ న్యూయార్క్ పర్యటన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర దృశ్యాలను ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై ప్రదర్శించారు. వీటిని కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం షేర్ చేసింది. టైమ్స్ స్వ్కేర్ ప్రపంచంలో అత్యంత రద్దీ కూడలి.. ఇక్కడి బిల్ బోర్డు స్ర్కీన్ స్పేస్ సంపాదించడం ఘనతగా భావిస్తుంటారు. కాగా, న్యూయార్క్లో డిన్నర్ సమావేశాన్ని ప్రవాస ఆంత్రప్రెన్యూర్ ఫ్రాంక్ ఇస్లాం, వ్యాపారవేత్తలు, సెనేటర్లు, కాంగ్రె్సమెన్లు నిర్వహించారు. మన్హట్టన్లోని జావిట్స్ సెంటర్లో, ప్రఖ్యాత హార్వర్డ్ వర్సిటీలోని హార్వర్డ్ క్లబ్లో రాహుల్ సృజనాత్మక రంగంలోని భారత సంతతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు.