తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశ వ్యాప్తంగా కేసీఆర్ అవినీతిని ఎండగడుతామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీచేస్తామని స్పష్టం చేశారు. నీళ్ళు, నిధులు, నియామకాల ఆకాంక్ష ఇంకా నెరవేరలేదన్నారు. తన అస్తిత్వం తప్పితే.. తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఆందోళనలు చేస్తే అరెస్టులు చేసి.. ఢిల్లీకి వెళ్లి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. జనవరి 30న డిల్లీలో సెమినార్, 31న విభజన హామీలపై ఆందోళన చేస్తామని ఆయన చెప్పారు.31న విభజన హామీలు, చట్టం అమలుపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇస్తామన్నారు. కృష్ణా జలాల సాధన కోసం ఈనెల 10న నిరసన దీక్ష చేస్తామని, జనవరి 20న ధరణి సమస్యలపై సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ నిధులను సైతం సర్కారు కొల్లగొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా బలోపేతం అవుతాం.. తెలంగాణను కాపాడుకుంటామన్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణవాదులమంతా ఐక్యమై తెలంగాణ వాదాన్ని రక్షించుకోవాలని నిర్ణయించామన్నారు. త్యాగాల పునాదిపైన ఏర్పడిన పార్టీ తెలంగాణ పేరును తొలగించిందని విమర్శించారు. ఉద్యమ అమరులను, తెలంగాణ వాదాన్ని అవహేళన చేసిందని కోందడరాం వ్యాఖ్యలు చేశారు.