బయ్యారంలో స్టీల్ ప్లాంట్ సంగతేంటి
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సరే..బయ్యారంలో స్టీల్ ప్లాంట్ సంగతేమిటి అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో కేంద్ర సర్కార్ విఫలమైనట్లు మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇవాళ వరంగల్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన తన ట్విట్టర్లో స్పందించారు. సుదీర్ఘ కాలం నుంచి పెండింగ్లో ఉన్న బయ్యారం స్టీల్ ప్లాంట్ పై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏపీ విభజన చట్టంలో హామీ ఇచ్చినా.. ఆ ప్లాంట్ ఏర్పాటు కలగానే మిగిలిపోయిందని, అసంపూర్తిగా ఉన్న ఆ డిమాండ్ను నెరవేర్చాలని మంత్రి కేటీఆర్ కోరారు.గత తొమ్మిదేళ్లుగా తాము బయ్యారం స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నామని, ఎన్నో పర్యాయాలు కేంద్రాన్ని కోరామని, కానీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ వరుసగా అభ్యర్థనలను తిరస్కరిస్తూ తమను నిరుత్సాహానికి గురి చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయని, ముడి ఇనుము.. నీళ్లు, విద్యుత్తు, బొగ్గు, నైపుణ్యం ఉన్న వర్క్ఫోర్స్ ఉన్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలి ఆందోళనకరంగా ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయకపోవడం వల్ల స్థానికంగా 15 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు దూరం అవుతున్నట్లు మంత్రి వెల్లడించారు.తెలంగాణలో పర్యటిస్తున్న సందర్భంగా బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశంలో మీరు గట్టి నిర్ణయాన్ని ప్రకటించాలని కోరుతున్నట్లు మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో ప్రధాని మోదీని కోరారు.