గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ లో సాదించింది ఏమిటి ?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వైఎస్ జగన్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా విశాఖలో చేపట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌  మొదటి రోజు అంతంత మాత్రమే జరగ్గా.. రెండోరోజు అట్టర్ ప్లాప్ అయ్యింది. మొదటి రోజు కాస్త మీడియాలో కనిపించిన ఈ సమ్మిట్.. రెండో రోజు కనీసం జనం చర్చించుకునే లోపే అలా ముగిసిపోయింది. రెండో రోజు డెలిగేట్స్, ఇన్వస్టర్స్ లేక సదస్సు వెలవెలబోయింది. దీంతో ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అని అప్పటికప్పుడు సచివాలయ సిబ్బంది, స్థానికంగా ఉన్న ఎంబీఏ స్టూడెంట్స్‌ను అధికారులు తరలించారు. కనీసం.. వారికి పాస్ కూడా ఇవ్వకుండానే డైరెక్టుగా సదస్సులోనికి అనుమతించేశారు. అయినప్పటికీ సమ్మిట్‌లో ఖాళీ కుర్చీలు కనిపించడం గమనార్హం. మరోవైపు.. జగన్ సర్కార్‌తో ఎంవోయూలు కుదుర్చుకున్న ఆ విదేశీ కంపెనీలేంటో తెలుసుకుందామకున్న రాష్ట్ర ప్రజల ఆశలు అడియాసలే అయ్యాయి. అంతేకాదు కనీసం విదేశీయుల ముఖాలు అయినా చూద్దామంటే రెండో రోజు ఎవరూ లేకపోవడంతో సమ్మిట్ తుస్సనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రెండోరోజు సమ్మిట్ తూతూ మంత్రంగానే సాగిందనే చెప్పుకోవచ్చు.

అధికారిక ప్రకటనలేవీ..!

14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సభావేదిక నుంచే సీఎం వైఎస్ జగన్‌తో  పాటు మంత్రులు గొప్పగా ఊదరగొట్టుకున్నారు. కానీ.. పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలు ఏవి..? ఎవరా గ్లోబల్ ఇన్వస్టర్లు..? అనేది మాత్రం ఎక్కడా ఏపీ ప్రభుత్వం బయటపెట్టలేదు. కనీసం అధికారికంగా ప్రకటన కూడా చేయలేదు. అసలు లిస్టడ్ కంపెనీల పెట్టుబడి వివరాలపై ప్రభుత్వం మౌనం ఎందుకు పాటిస్తోందో అనేది ఎవరికీ తెలియని ప్రశ్న. సమ్మిట్ అయిపోయి గంటలు గడుస్తు్న్నా ఇంతవరకూ వచ్చిన పెట్టుబడులు ఏంటి..? ఎవరెవరికి ఎంవోయూలు ఇచ్చారు..? అనే విషయాలను అధికారికంగా ప్రకటించలేని పరిస్థితి. వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో హడావుడి చేశాయో తప్ప.. మీడియాలో మాత్రం అసలు సమ్మిట్‌పై ఎక్కడా ప్రసారాల్లేవ్.

ప్లాన్ అట్టర్ ప్లాప్..!

సదస్సు నిర్వహిస్తున్నారంటే తర్వాత ఏం చేయాలి..? ఎలా ముందుకెళ్లాలి..? అనే దానికొక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. కానీ ఇది కొట్టొచ్చినట్లు కనిపించింది. మొదటి రోజే భోజనం, కిట్‌ల కోసం.. జనాలు తన్నుకున్న పరిస్థితిని మనం ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ వీడియోల్లో ఎక్స్‌క్లూజివ్‌గా చూశాం. ముఖ్యంగా కనీసం టాయిలెట్ల సౌకర్యం లేక డెలిగేట్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో సమ్మిట్ నుంచి తీవ్ర అసహనంతో కొందరు ఇన్వస్టర్లు బయటికొచ్చేసిన పరిస్థితి. పోనీ రెండోరోజు అయినా ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చిందా అంటే అస్సలు రాలేదు. కనుచూపు మేరలో ఎక్కడా డెలిగేట్స్, ఇన్వస్టర్స్ కనిపించలేదు. మొదటి రోజు సమ్మిట్‌లో ఎక్కడ చూసినా జనం కనిపించినా రెండోరోజు డెలిగేట్స్, ఇన్వస్టర్స్‌ కనీసం స్థానికులు కూడా లేక వెలవెలబోయింది. దీంతో అప్పటికప్పుడు జనసంఖ్య కనిపించాలని సచివాలయ సిబ్బంది, ఎంబీఏ కాలేజీల నుంచి విద్యార్థులను తరలించారు. స్వయంగా ఈ విషయాన్ని విద్యార్థులే మీడియాకు చెప్పారు. తాము ఫలానా కాలేజీ నుంచి వచ్చామని చెబుతాన్నారు. రెండ్రోజుల సమ్మిట్ అట్టర్ ప్లాప్ అయ్యిందని విశ్లేషకులు చెబుతున్నారు.

జగన్‌లో తీవ్ర అసంతృప్తి..!

సమ్మిట్ మొదటిరోజు హడావుడిగా కనిపించిన సీఎం వైఎస్ జగన్.. శుక్రవారం సాయంత్రానికి ఢీలా పడిపోయారట. దీంతో కనీసం పెట్టుబడిదారులు, అతిథులు విశాఖలోని వీఎంఆర్డీఏ ఎంజీఎం పార్కులో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు కూడా హాజరుకాలేదు. 2వేల మందికి ఆతిథ్యం ఇచ్చేలా పార్కును ముస్తాబు చేసినప్పటికీ సాయంత్రానికి డెలిగేట్స్, ఇన్వస్టర్స్ ఎవరూ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన సీఎం జగన్ కూడా వెళ్లలేదని తెలుస్తోంది.మొత్తానికి చూస్తే.. పెట్టుబడులు రాక, వందల కోట్ల ప్రజాధనం వృథా అయిపోయిందనే మాటలు ఎక్కడ చూసినా వినిపిస్తున్నాయి. అయితే.. రెండ్రోజుల సమ్మిట్ సక్సెస్ అయ్యిందనే మాట వైసీపీ పార్టీ శ్రేణుల నుంచి రాకపోవడం గమనార్హం. అయితే జగన్ సొంత మీడియాలో మాత్రం ఆహో.. ఓహో అని మాటలు వినిపిస్తున్నాయా తప్పితే మరెక్కడా చలీచప్పుడు లేదు. ఈ మొత్తం వ్యవహారంపై అధికార పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Leave A Reply

Your email address will not be published.