తానెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాను ..
- తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని రఘునందన్ రావు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మూడు పదవుల్లో ఎదో ఒక పదవి ఇవ్వాలని.. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ లేదంటే జాతీయ అధికార ప్రతినిధి ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నానని, తానెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కానని అన్నారు. కొన్ని విషయాల్లో తన కులమే తనకు శాపం కావచ్చునని, రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందన్నారు. రెండో సారి కూడా దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకకు అమిత్ షా వచ్చి ప్రచారం చెయ్యలేదని, తనకు దుబ్బాక ఎన్నికలలో ఎవరూ సాయం చెయ్యలేదని అన్నారు. తాను పార్టీలో ఉండాలని అనుకుంటున్నానని చెప్పారు.మునుగొడులో రూ. 100 కోట్లు పెట్టిన బీజేపీ గెలవలేదని… సొంతంగానే తాను దుబ్బాక ఎన్నికల్లో గెలిచానని రఘునందన్ రావు అన్నారు. అదే రూ. 100 కోట్లు తనకిస్తే తెలంగాణను దున్నేసేవాడినన్నారు. దుబ్బాకలో నన్ను చూసే ప్రజలు గెలిపించారు.. బీజేపీని చూసి కాదని అన్నారు. తనకంటే ముందు బీజేపీ పోటీచేస్తే 3500 ఓట్లు వచ్చాయన్నారు. బండి సంజయ్ ది స్వయం కృతాపరాధమని, పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన సంజయ్కు వంద కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చేంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. పార్టీ డబ్బులో తనకూ వాటా ఉందన్నారు.పేపర్ ప్రకటనలలో తరుణ్ చూగ్ సునీల్ బాన్సల్ బొమ్మలు కాదు.. రఘునందన్ ఈటెల రాజేందర్ బొమ్మలుంటే ఓట్లు వేస్తారని రఘునందన్ రావు అన్నారు. పార్టీకి శాశనసభపక్ష నేత లేడనే విషయం జేపీ నడ్డా కు తెలియదని.. ఆ విషయమై ప్రశ్నిస్తే అదేంటి అంటూ నన్నే నడ్డా అడిగారన్నారు. తాను గెలిచినందుకే ఈటెల పార్టీలోకి వచ్చారన్నారు. బండి సంజయ్ మార్పుపై మీడియా ప్రశ్నించగా.. మీడియాలో వస్తున్నవన్నీ నిజాలేనని అన్నారు. పది ఏళ్లలో పార్టీ కోసం తనకంటే ఎక్కువ ఎవరు కష్టపడలేదని రఘునందన్ రావు అన్నారు.