రూ.2000 నోట్ల ఉపసంహరణ తో భారీగా తగ్గిన డిజిటల్ పేమెంట్లు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్; రూ.2000 నోట్ల ఉపసంహరణ తో సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బీఐ కీలక రిపోర్ట్ విడుదల చేసింది. దేశంలో డిపాజిట్లు, రుణాలు, వినియోగంపై ఈ పెద్ద నోటు ఉపసంహరణ గణనీయ ప్రభావాన్ని చూపుతుందని అంచనా వేసింది. వినియోగ డిమాండ్ రూ.55 వేల కోట్ల మొత్తంలో పెరగొచ్చని విశ్లేషించింది. రూ.2 వేల నోటు ఉపసంహరణ ఫలితాల్లో వినియోగ డిమాండ్ తక్షణం పెరుగుదల ఒకటని తెలిపింది. నోట్ల రద్దు మాదిరిగా కాకుండా రూ.2 వేల నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థలో వినియోగానికి ఊతమిస్తుందని ఎస్‌బీఐ రిపోర్ట్ లెక్కగట్టింది. బంగారు, నగలు, ఏసీ, మొబైల్ ఫోన్లు, రియల్ ఎస్టేట్ వంటి అధిక వ్యాల్యూ ఉన్న వస్తువుల కొనుగోళ్లు పెరుగుతాయని తెలిపింది.ఉదాహరణకు నగదు లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. పెద్ద ఎత్తున రూ.2 వేల నోట్లు చెలామణిలోకి వచ్చాయి. ఆలిండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (AIPDA) విడుదల చేసిన రిపోర్ట్ ఇందుకు అద్దం పడుతోంది. రూ.2 నోట్ల ఉపసంహరణకు ముందు అమ్మకాల్లో 40 శాతంగా ఉన్న డిజిటల్ పేమెంట్లు భారీగా తగ్గాయని వివరించింది.

క్యాష్ ఆన్ డెలివరీల్లో పెరుగుదల..

పెద్ద నోటు ఉపసంహరణ తర్వాత క్యాష్ ఆన్ డెలివరీలు కూడా పెరిగాయి. క్యాష్ ఆన్ డెలివరీపై ఆర్డర్లు చేసే వారి సంఖ్య పెరిగిందని ఎస్బీఐ రిపోర్ట్ పేర్కొంది. జొమాటో యూజర్లలో 75 శాతం క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకుంటుండగా.. వారిలో రూ.2 వేల నోట్లు చెల్లిస్తున్నవారు కూడా ఉన్నారు. ఇక గృహోపకరణాల విక్రయాలు కూడా పెరిగాయని ఎస్‌బీఐ రిపోర్ట్ ప్రస్తావించింది. రూ.2 వేల నోటు ఉపసంహరణ కారణంగా దేశంలో నగదుపై పెద్దగా ప్రభావం చూపబోదని చెప్పింది. ఇక రుణాల పరంగా చూస్తే.. డిపాజిట్లలో 30 శాతం అంటే దాదాపు రూ.92,000 కోట్లు రుణాలకు పోయే అవకాశం ఉందని వివరించింది. మున్ముందు కూడా రుణ జారీ పెరిగే అవకాశముందని విశ్లేషించింది. మొత్తంగా జీడీపీ వృద్ధి రేటుకు ఇది సానుకూలమవుతుందని తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.