కేటీఆర్ కు రాఖీ కట్టిన రుద్ర రచన

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఐటీ ఉద్యోగిని రుద్ర రచన రాఖీ కట్టారు. మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటన నుంచి తిరిగి రావడంతో రుద్ర రచన సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంతకూ రుద్ర రచన ఎవరనేగా మీ సందేహం..? ఆమె ఒకప్పుడు ఓ అనాథ బాలిక. మంత్రి కేటీఆర్ సాయంతో విద్యాభ్యాసం చేసి ఐటీ కంపెనీలో ఉద్యోగం సాధించారు. అంతేకాదు గత ఏడాది తన వేతనంలోకి రూ.లక్ష సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా కూడా ఇచ్చారు.జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన రుద్ర రచన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి స్థానిక బాల సదనంలో ఉంటూ జగిత్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత హైదరాబాద్ యూసఫ్‌గూడ‌లోని స్టేట్ హోమ్‌లో ఉంటూ పాలిటెక్నిక్ విద్య పూర్తి చేశారు. ఈసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా హైదరాబాద్ సీబీఐటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ సీటు సంపాదించారు. అయితే తల్లిదండ్రులు లేని రుద్ర రచన తన ఇంజనీరింగ్ ఫీజు చెల్లించలేకపోయింది. 2019లో సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి ఆమెను ప్రగతి భవన్‌కు పిలిపించుకొని ఇంజినీరింగ్ చదువు పూర్తి అయ్యేందుకు అవసరమైన ఖర్చులను భరిస్తానని భరోసా ఇచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం రుద్ర రచన ఇంజినీరింగ్ ఫీజులు, హాస్టల్ సంబంధిత ఖర్చులను కేటీఆర్ తన వ్యక్తిగత సంపాదన నుంచి భరించారు. కేటీఆర్ ఆర్థిక సహాయంతో ఇంజినీరింగ్ చదివిన రుద్ర రచన.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో నాలుగు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు. ఆ సంద‌ర్భంగా ప్రగతి భవన్‌లో మంత్రిని కలువగా ఆమె చదువు, ఉద్యోగాల గురించి తెలుసుకుని సంతోషపడ్డారు. తనకంటూ ఎవరూ లేకున్నా రుద్ర రచన ఆత్మ విశ్వాసంతో జీవితంలో విజయం సాధించిందని మెచ్చుకున్నారు. అప్పుడు కూడా రుద్ర రచన మంత్రి కేటీఆర్‌కు వెండి రాఖీ తయారు చేయించి కట్టారు.

Leave A Reply

Your email address will not be published.