వైసిపి ప్రజల విశ్వసనీయత కోల్పోతుంది

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఒక్కో ఎన్నికకు ఒక్కో కుట్ర సిద్ధాంతం. ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ ఇదే విధానాన్ని నమ్ముకుందా?. ప్రభుత్వ సలహాదారు..వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. షర్మిల కాంగ్రెస్ లో చేరటం చంద్రబాబు కుట్రే అంటూ సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రకటించారు. అంతే కాదు …వైఎస్ మరణం విషయంలో కాంగ్రెస్ పై అనుమానాలు ఉన్నాయంటూ శనివారం నాడు మీడియా తో మాట్లాడుతూ సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జల చెప్పినట్లు కాసేపు ఇవే విషయాలు నిజం అనుకుందాం. షర్మిల కాంగ్రెస్ పార్టీ లో చేరకపోయి ఉంటే వై ఎస్ మరణం విషయంలో ఆ పార్టీ పై అనుమానాలు ఉన్నా కూడా ఏమీ మాట్లాడకుండా ఉండేవాళ్ళు అన్నమాట. షర్మిల కాంగ్రెస్ లో చేరిన తరుణంలో.. ఎన్నికల వేళ సజ్జల ఈ మాటలు మాట్లాడటం వెనక మతలబు ఏమిటి?. నిజంగా సజ్జలకు..వైసీపీ కి కాంగ్రెస్ పై అనుమానాలు ఉంటే ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత శక్తివంతంగా ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ కానీ..సీఎం జగన్ కానీ ఈ విషయంలో చేసింది ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఏమి లేదు అనే చెప్పాలి. లోక్ సభ లో వైసీపీ ఏకంగా ఇరవై రెండు మంది ఎంపీలు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ విషయాన్నీ కూడా ఎక్కడ లేవనెత్తిన దాఖలాలు లేవు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ లోకి షర్మిల ఎంట్రీ ఖచ్చితంగా ఎంతో కొంత వైసీపీ ఓటు బ్యాంకు కు గండి కొట్టటం ఖాయం అనే భయంతో సజ్జల ఒక వైపు చంద్రబాబు పేరును…మరో వైపు వై ఎస్ హత్య వెనక కాంగ్రెస్ ఉంది అనే అనుమానాలను తెర మీదకు తెచ్చినట్లు కనిపిస్తోంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.